293places | 15 ఏళ్ల దీదీ పాలనకు చరమగీతం
293places | 15 ఏళ్ల దీదీ పాలనకు చరమగీతం
293 స్థానాలకు గాను 173 చోట్ల ఆధిక్యం
113 స్థానాలకే పరిమితమై తృణమూల్ కాంగ్రెస్
భవానీ పూర్లో మమత ముందంజ
………………………………
పశ్చిమ బెంగాల్ … మొత్తం స్థానాలు 293
బీజేపీ .. 173
తృణమూల్ కాంగ్రెస్ … 113
కాంగ్రెస్ పార్టీ …… 4
ఇతరులు .. 3
కోల్కతా, ఆంధ్రప్రభ : పదిహేనేళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు బీజేపీ చరమగీతం పాడింది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో కమలనాథులు ఊహించని షాక్ ఇచ్చారు. రాజకీయాల్లో కొరకరానికొయ్యగా మారిన దీదీని ప్రజాతీర్పుతో ఇంటికి సాగనంపారు. ఇక మమత పోటీ చేసిన భవానీపూర్లో ఆమె తన ప్రత్యర్థి సువేందు కంటే 8వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాలో సుదీర్ఘపోరాటం అనంతరం బీజేపీ తన కల నెరవేర్చుకుంది.. బెంగాల్ గడ్డపై పాగా వేసింది.. 294 స్థానాలున్న అసెంబ్లీలో 293 చోట్ల ఎన్నికలు జరిగాయి.. ఒక స్థానంలో ఈ నెల 21 రీ పోలింగ్ జరగనుంది. ఇక నేటి ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా బీజేపీ – టీఎంసీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. ఇద్దరూ ఎక్కడా తగ్గటం లేదు. ఫలితాల్లో ఇప్పటి వరకు బీజేపీ భారీ ఆధిక్యతలో కొనసాగుతోంది. అధికార పీఠానికి కావల్సిన 147 స్థానాల కంటే ఎక్కువగానే లీడ్ సాధించింది.. ప్రస్తుతం ఆ పార్టీ 173 కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక అధికార తృణమూల్ కాంగ్రెస్ 113 చోట్ల లీడ్లో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల, ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
తృణమూల్కు కమలనాథుల షాక్
ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో గత మూడు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఎంసీ నాలుగోసారి విజయంపై ధీమాగా ఉంది. మరోవైపు బెంగాల్లో పాగా వేయాలని శక్తియుక్తులన్నీ ధారపోసిన బీజేపీ కూడా తనదే విజయం అని చెప్పుకుంది. ఎగ్జిట్పోల్స్లో ఎక్కువశాతం మాత్రం బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. అయితే, తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమత ప్రకటించారు.
భవానిపూర్లో మమత ముందంజ
మమత పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఫలితంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఆమె తన ప్రత్యర్థి బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిపై 8వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2021 ఎన్నికల్లో సువేందు నందిగ్రామ్లో మమతను ఓడించారు. ఈసారి కూడా అదే ఫలితం వస్తుందా? మమత పైచేయి సాధిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలుండగా, నేడు 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు. ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్ను ఈసీ రద్దుచేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత మూడు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఎంసీ నాలుగోసారి విజయంపై ధీమాగా ఉంది. అయితే, ఫలితాల్లో మాత్రం తృణమూల్ ఓటమిని మూటగట్టుకుంది.
