Sunday, June 30, 2024

TG | వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష..

వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, వస్త్ర విభాగాల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కా మల్లు, మంత్రి తుమ్మాలా నాగేశ్వర రావు సమీక్షి నిర్వహించారు. ఈ స‌మావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలపై ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్ పై సమీక్ష చేశారు.

ఆయిల్ ఫామ్ సాగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాలు ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై చర్చించారు. ఇక‌ రాష్ట్రంలో గత ప్రభుత్వం అధాకారంలో ఆగిపోయిన వ్యవసాయ పథకాలు… అందుకు గల కారణాలను వివరించాలని సమావేశంలో వ్యవసాయ అధికారులను డిప్యూటీ సీఎం కోరారు.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ చేయడం ద్వారా వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు…. రాబోయే సీజన్ కు సంబంధించి పంటల బీమాకు పిలవాల్సిన టెండర్లపై చర్చించారు.

రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లోని వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలను డిప్యూటీ సీఎం తీసుకున్నారు. వ్యవసాయ కళాశాలలో విత్తనాభివృద్ధిపై చర్చించారు. అలాగే విత్తన అభివృద్ధి కార్పొరేషన్ కార్యకలాపాల గురించి ఆరా తీశారు.

రైతుల సంక్షేమం కోసం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామని… వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే, ఉత్పత్తులు పెరుగుతాయని, రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.

ఇక రైతు భరోసాకు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది…. ఏ విధంగా ముందుకు పోతే మంచిది అనే విషయాలను రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని… రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతులను భాగస్వాములను చేయాలని, అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ కు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయం వ్యక్తపరిచారు.

రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో వచ్చిన మార్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను విచారించారు. సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్ టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి ఏ పద్ధతిలో ప్రయోజనం పొందుతున్నారు.. తదితర వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు.

ఈ సమావేశానికి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కాతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement